సలాం, తెలంగాణను బతికించుకుందాం: షర్మిల
తెలంగాణ ప్రజలకు వైయస్సార్ కూతురి అభివాదం అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. "పవిత్రమైన తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా. వైయస్సార్కూ జగనన్నకూ తెలంగాణ అంటే ప్రాణం" అని చెప్పుకున్నారు. తెలంగాణవాసులంటే వైయస్కు ప్రత్యేకమైన ప్రేమ అని ఆమె చెప్పారు. వైయస్ తన పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభించారని, సంక్షేమ పథకాలను అన్నింటినీ తెలంగాణ నుంచే మొదలు పెట్టారని ఆమె అన్నారు.
నాన్నగారంటే తెలంగాణవాసులకు చాలా ప్రేమ అని, నాన్నగారు చనిపోయినప్పుడు గుండెలు ఆగి చనిపోయినవారిలో చాలా మంది తెలంగాణ వాళ్లున్నారని ఆమె అన్నారు. తెలంగాణ వెనకబాటుతనాన్ని రూపుమాపడానికి వైయస్ తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆమె చెప్పారు. వైయస్ ఎంతటి మహానేతో తెలిసి కూడా కాంగ్రెసు పార్టీ అవమానిస్తోందని విమర్శించారు. వైయస్ తెచ్చిన అధికారంలో పదవులు అనుభవిస్తున్నవారు వైయస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినా మాట్లాడడం లేదని అన్నారు. వారికి చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. పైగా, వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడని చెప్పుకుంటున్నారని షర్మిల అన్నారు. వైయస్ పేరు ఉచ్చరించే అర్హత కూడా వారికి లేదని అన్నారు.
ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడని, తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని గుర్తించి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుట్రలు చేసి అబద్ధం కేసులు పెట్ిట విచారణ పేరుతో సిబిఐని వాడుకుని జగనన్నను జైలులో పెట్టించాయని ఆమె విమర్శించారు. విలువలు, విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కాంగ్రెసు కలిసిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై లేనిపోని విమర్శలు చేస్తున్నాడని ఆమె అన్నారు. చంద్రబాబును చూస్తుంటే నాన్నగారు చెప్పిన ఓ మాట గుర్తుకు వస్తోందని, నిజం చెప్తే తల వేయి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందట అని వైయస్ చెబుతుండేవారని ఆమె అన్నారు.
జగనన్నకు విశ్వసనీయత ఉంది కాబట్టే చంద్రబాబును వదిలేసి శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. వైయస్, జగనన్నలకు ఉన్నదీ, చంద్రబాబుకు లేనిదీ విశ్వసనీయత అని అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న రాజ్యం వస్తుందని, అప్పటి వరకు జగనన్నను ఆశీర్వదించాలని ఆమె అన్నారు.
దేవుడున్నాడనేది ఎంత నిజమో, మంచివారికి దేవుడు నిజం చేస్తాడనేది కూడా అంతే నిజమని, దేవుడి దయతో జగనన్న తప్పకుండా బయటకు వస్తారని, రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడని ఆమె అన్నారు. ఉదయించే సూర్యుడిని ఆపలేనట్లు జగనన్నను కూడా ఆపలేరని ఆమె అన్నారు.