బాబాయ్కి కాంపైన్, మామయ్య సిఎం: జూ. ఎన్టీఆర్
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బాలయ్య రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని, చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్రలో పాల్గొనే విషయం ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.
బాద్షా చిత్రం షూటింగు పూర్తయిన తర్వాత చంద్రబాబు పాదయాత్రలో తాను పాల్గొనే విషయం ఆలోచిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. పార్టీ అభివృద్ధికి, ప్రచారానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తాను ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు.
చంద్రబాబుతో విభేదాలతో దూరంగా ఉంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చంద్రబాబు మహబూబ్నగర్ జిల్లాలో అస్వస్థతకు గురైనప్పుడు వెళ్లి పరామర్శించారు. రాజకీయంగా ఆయన తెలుగుదేశం పార్టీకి మళ్లీ దగ్గర కావాలని అనుకుంటున్నట్లు తాజా ప్రకటనను బట్టి అర్థమవుతోంది. గత కొద్ది కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్నారు.