వైఎస్ నీళ్ల దొంగ, బాబు మోకాళ్లయాత్ర చేసినా..: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: పోతిరెడ్డిపాడు నుంచి తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోయిన దొంగగా వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అభివర్ణించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం వద్దని, తెలంగాణ రాజ్యం కావాలని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట సమరభేరీ సభలో ఆయన ఆదివారం రాత్రి ప్రసంగించారు.

చంద్రన్న రాజ్యాన్ని తొమ్మిదేళ్లు చూశామని, రాజన్న రాజ్యం కూడా చూశామని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసంచబోరని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ భూములు, ఆస్తులు, వనరులు కొల్లగొట్టారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడికి బయ్యారం గనులు, జగన్‌కు ఓబుళాపురం గనులను ఇచ్చారని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు దారాదత్తం చేశారని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎవరూ జైలుకు పంపించలేదని, కోర్టులే పంపించాయని, కోర్టులు కుట్ర చేశాయని విజయమ్మ అనగలరా అని ఆయన అన్నారు. ఎవరో వచ్చి ఏదేదో చెప్తే ఆగమాగం కావద్దని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు. డిసెంబర్ 9వ తేదీన తెచ్చుకున్న తెలంగాణను చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం రాజన్న రాజ్యంలోనివేనని, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగలేదని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఝంగా మార్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం దేశ ప్రజలంతా ఒప్పుకోవాలని వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రజలను అడిగిందా అని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విధానాన్ని చంద్రబాబు ప్రారంభిస్తే చంద్రబాబు కొనసాగించారని, సిఎం పదవి కూడా కాంట్రాక్టు ఉద్యోగమైతే పీడా పోయేదని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని విజయమ్మ అంటున్నారని, తిరుపతిలో రిమ్స్ పూర్తయి బీబీనగర్ నిమ్స్ ఎందుకు పూర్తి కాలేదని అన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ కారణంగా నివాసం యోగం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. సూర్యాపేటలో పోటీ సభ పెడుతామని అన్నారని, సూర్యుడి మీద ఉమ్మేస్తే వారి ముఖం మీదనే పడుతుందని ఆయన అన్నారు.

రాజన్న రాజ్యంలో జగన్ దందాల వల్ల అధికారులు, మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. గత 56 ఏళ్లుగా కాంగ్రెసును మోసం చేస్తోంది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. ఆంధ్ర నాయకుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల వెనక నాలుగున్నర కోట్ల ప్రజలున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 24 జిల్లాలు ఏర్పాటవుతుందని, సూర్యాపేట కూడా ఓ జిల్లా అవుతుందని ఆయన చెప్పారు.

తెలంగాణకు కోసం చర్చలకు పిలిస్తే అయినను పోయి రావాలె హస్తినకంటూ వెళ్లాలని, కాంగ్రెసు మొండిచేయి చూపిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి కూడా అంగీకరించామని ఆయన చెప్పారు. అయితే, కాంగ్రెసు మళ్లీ దొంగ నాటకం ఆడిందని ఆయన అన్నారు. లక్ష్యాన్ని మధ్యలో వదిలేసే నీచమానవులం తాము కాదని ఆయన అన్నారు. తన తల తెగిపడినా ఎత్తిన జెండా దించేది లేదని, ఆరు నూరైనా తెలంగాణ సాధించుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తదితరులు కూడా ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+