జగన్ను పట్టించుకోం: కిరణ్ 'స్కీం'లు, రాని జైపాల్ రెడ్డి
కాంగ్రెసు పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. జగన్ తన కంపెనీలో పెట్టుబడులపై చంచల్గూడ జైలుకు వెళ్లారన్నారు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసి వెళ్లలేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పలు పథకాలతో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. వాన్ పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో అప్పుడు ఆయన అదే చేశారన్నారు. ఈ సందర్భంగా కిరణ్ పలు పథకాలు ప్రకటించి, ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు.
వంద కోట్ల రూపాయలతో ఇందిరమ్మ అమృత హస్తం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రెండు లక్షల మంది గర్భిణీలకు, లక్ష మంది పిల్ల తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 120 కోట్లతో రాజీవ్ విద్యా దీవెన ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి 150 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఉపాధి హామీని మరో యాభై రోజులు పెంచడం ద్వారా ప్రభుత్వంపై రూ.884 కోట్ల భారం పడుతుందని, అయితే 12.9 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గీత కార్మికుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 228 ఎస్సీ, ఎస్టీ టీచర్ పోస్టుల భర్తీ, 69 ఉద్యోగాలతో మైనార్టీలకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కిరణ్ 2014 టార్గెట్గా వరాల జల్లు కురిపించారు.
కాగా ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. తనకు ప్రత్యేక ఆహ్వానం లేకపోవడం, ప్రకటనలలో తన ఫోటో లేకపోవడంపై ఆయన కలత చెందారు.