జగన్కు తెలంగాణలో 50కి పైగా సీట్లు వస్తేనే...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో తమకు 60 సీట్లకు పైగా సీట్లు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకురాలు కొండా సురేఖ అన్నారు. దీంతో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంత సత్తా ఉందా అనే చర్చ ప్రారంభమైంది. శాసనసభలో మొత్తం 294 సీట్లు ఉండగా, తెలంగాణలో 119 ఉన్నాయి. సీమాంధ్రలో 175 సీట్లు ఉన్నాయి. సీమాంధ్రలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కొన్ని సీట్లు పంచుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందా అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే.
తెలంగాణలో మజ్లీస్కు ప్రస్తుతం 7 సీట్లు ఉన్నాయి. మరో రెండు, మూడు సీట్లను అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు వల్ల గెలుచుకుంటుందని అనుకున్నా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచే స్థానాలు తెలంగాణలో ఏమున్నాయనేది ప్రశ్న. అత్యంత బలమైన అభ్యర్థిగా భావించిన కొండా సురేఖనే పరకాల ఉప ఎన్నికలో ఓడిపోయారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి మాత్రం తప్పలేదు. పరిస్థితి చూస్తుంటే, పోటీ వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్యనే ఉంటుందని చెప్పవచ్చు. కానీ తెరాసను, కాంగ్రెసును, తెలుగుదేశం పార్టీని ఢీకొని తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఖాయంగా చెప్పలేం.
కొండా సురేఖ చెప్పినట్లు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో వస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. 2009లో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. తెరాసకు పది స్థానాలు మాత్రమే దక్కాయి. పొత్తుల్లో జరిగిన లొసుగుల వల్ల, తెలుగుదేశం, వామపక్షాలు తెరాస అభ్యర్థులకు ఓటు వేయకపోవడం వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఇప్పుడు తెరాసను ఎదుర్కోవడం అంత సులువైన పని కాదనే మాట వినిపిస్తోంది.
కాంగ్రెసు, తెరాస కలిసి 2004లో దాదాపు 80 స్థానాలను దక్కించుకున్నాయి. అందులో తెరాసకు వచ్చాయి. మిగతా స్థానాలన్నీ కాంగ్రెసు పార్టీవే. దానివల్ల కాంగ్రెసు పూర్తి మెజారిటీ సాధించింది. తెలుగదేశం పార్టీకి అప్పట్లో కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. 1999లో కాంగ్రెస్, తెలుగుదేశం పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నాయి. మూడో పార్టీ లేకపోవడం వల్ల అలా జరిగింది.
ఆ ఎన్నికల్లో కోస్తా, రాయలసీమలలో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా సీట్లు సంపాదించుకుని అధికారంలోకొచ్చింది. అంటే, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్నా తెలంగాణలో 50కి పైగా సీట్లు వస్తేనే ఏ పార్టీకైనా అధికారం దక్కుతుందనేది అర్థమై పోతోంది. 1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి.
తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో తెలుగుదేశం కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి. ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. తెలంగాణలో దాదాపు యాభై సీట్లు సంపాదించుకునే దిశగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టి పెట్టిందని అంటున్నారు.