కెసిఆర్పై షర్మిల: వెనక్కి తీసుకోపోతే.. జూపల్లి హెచ్చరిక
తమ పార్టీ నేతకు క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు. బయ్యారం గనులకు వైయస్ కుటుంబానికి సంబంధం ఉందనే విషయం అందరికీ తెలుసునన్నారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. షర్మిల మాటల్లో ఎంత నిజాయితీ ఉందో అందరికీ తెలుసునన్నారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలు తెలంగాణ ద్రోహులే అన్నారు. వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకున్నారన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలమని వైయస్ విజయమ్మ ఒట్టేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలంగాణ రాష్ట్ర విభజనపై రెండో ఎస్సారెస్సీ కోరుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడంలో పెద్ద విషయమేమీ లేదన్నారు. ఆయన తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. సమైక్యవాది అయిన గాదె రెండో ఎస్సారెస్సీనే కోరతారని, తాము మాత్రం తెలంగాణ తప్ప మరోటి ఒప్పుకునేది లేదన్నారు.
కాగా షర్మిల వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెరాస అధికార ప్రతినిధి పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ నేత నిరంజన్ రెడ్డి తదితరులు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.