కెసిఆర్ కొత్త ప్లాన్: పొత్తుకు కాంగ్రెసు ఎంపీల ఫ్రంట్?
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ, పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాల్సింది కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం. కాంగ్రెసు తనను చర్చలకు పిలిచి మోసం చేసిందని కెసిఆర్ చెబుతున్నారే తప్ప ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టితోనే కాంగ్రెసును సున్నితంగా విమర్శిస్తూ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై విరుచుకుపడుతున్నారనే మాట వినిపిస్తోంది.
కెసిఆర్ తమకు మిత్రుడేనని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి వాయలార్ రవి ఇటీవల అన్నారు. కెసిఆర్ను చర్చలకు ఎవరు పిలిచారనేది అప్రస్తుతమని, చర్చలు మాత్రం జరిపామని ఆయన అన్నారు. ఈ చర్చల సందర్భంగానే కాంగ్రెసుతో కలిసి కెసిఆర్ ఎన్నికల ఎత్తుగడ ఖరారైనట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కెసిఆర్పై కాంగ్రెసు నాయకులు కూడా పెద్దగా విమర్శలు చేయడం లేదని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ఎన్నికలలోగా నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో లేదని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో గట్టెక్కడానికి మాత్రం ప్రణాళిక సిద్ధమైనట్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఫ్రంట్ కడతారనే వార్త ప్రచారంలో ఉంది. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నేతృత్వంలో ఈ ఫ్రంట్ ఎన్నికల నాటికి రూపుదిద్దుకుంటుందని అంటున్నారు. ఫ్రంట్ మీద పోటీ చేసి, కేంద్రంలో కాంగ్రెసుకు తగిన బలాన్ని అందించాలనే కాంగ్రెసు అధిష్టానం సూచనలకు అనుగుణంగానే ఆ పార్టీ ఎంపిలు కూడా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి వచ్చి ఫ్రంట్ కట్టిన నేతలతో ఎన్నికల సమయంలో కెసిఆర్ దోస్తీ కట్టే అవకాశాలున్నాయని బిజెపి అనుమానిస్తోంది. అందుకే, కెసిఆర్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేదని, తెరాస బలోపేతానికి కళ్లెం వేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో తాము అధికారంలోకి రావడానికి ఆ అవసరం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద కెసిఆర్ కాంగ్రెసుపై తిరుగులేని పోరాటం చేస్తారనే నమ్మకం క్రమంగా సన్నగిల్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.