టెక్కీ డెత్ మిస్టరీ, నదిలో దూకి ఆత్మహత్యనా?
స్వీడన్లో రామచంద్రన్ అనే 30 ఏళ్ల ఇంజనీర్ ఏడాదిన్నరగా పనిచేస్తున్నాడు. అతను నవంబర్ 25వ తేదీన చెన్నైకి తిరిగి వచ్చాడు. పని నచ్చక సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. తాను క్షవరం చేయించుకోవడానికి వెళ్తున్న మంగళవారంనాడు తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఇంటికి రాలేదు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు అతని శవం నదిలో తేలుతూ కనిపించింది. కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియజేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించరాు.
అతని దుస్తుల్లో కొంత నగదు, ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఎటువంటి సూసైడ్ నోట్ లేదని గుర్తించారు. అతను తీవ్రమైన పని ఒత్తిడికి గురై బాధపడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని సంస్థ ఉద్యోగం నుంచి తీసేసిందని సహోద్యోగులు పోలీసులకు తెలిపారు.
పనికి సంబంధించిన సమస్యలను రామచంద్రన్ కుటుంబ సభ్యులకు వివరించాడని కూడా తెలుస్తోంది. తాను ఉద్యోగం చేయలేకపోతున్నానని, ఇంటికి వెళ్లిపోతానని చెప్పేవాడట. సంస్థ అతని పనితో సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. రామచంద్రన్ శరీరంపై ఏ విధమైన గాయాలు లేవని పోలీసులు చెప్పారు. అందువల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న మూడో టెక్కీ రామచంద్రన్.