సాన్వీ హత్య కేసు: టెక్కీ రఘుకు మరణశిక్ష?
అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం - రఘునందన్ పూర్తిగా జూదశాలల్లోని ఆటలకు పూర్తి స్థాయిలో బానిసగా మారాడు. అమెరికాలోని శాన్జోన్, కాలిఫోర్నియా, వంటి పలు నగరాల్లోని కాసినోల్లో ఆయన 50 వేల డాలర్లకు పైగా పోగొట్టుకున్నాడు. దానికితోడు, తన వద్ద ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన తొమ్మిది క్రెడిట్ కార్డులను వాడి 26,268 డాలర్ల విలువైన కొనుగోళ్లు జరిపాడు.
దాంతో డబ్బులు డిమాండ్ చేసి అప్పులు తీర్చడానికి రఘు సాన్వీని కిడ్నాప్ చేశాడు. ఆ ఆలోచనతో అక్టోబర్ 22వ తేదీన మాంటిబోమేరీ కౌంటీ అపార్టుమెంటులో ఉంటున్న వెన్న వెంకట్, చెంచులతలకు సంబంధించిన ఫ్లాట్లోకి వెళ్లాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వెంకట్, లత అప్పటికే కార్యాలయాలకు వెళ్లిపోయారు. ఇంట్లో సత్యవతి, పది నెలల సాన్వీ మాత్రమే ఉన్నారు.
ఇంట్లోకి వెళ్లే ముందు తాను ఎవరినీ చంపాలని అనుకోలేదని, సత్యవతిని కత్తితో బెదిరించి పాపను ఎత్తుకెళ్లాలని అనుకున్నానని, కానీ ఆమె అడ్డం రావడంతో గొంతు కోశానని రఘు తన వాంగ్మూలంలో తెలిపాడు. సత్యవతి పడిపోయిందని, ఏడుస్తున్న సాన్వీ నోటిని దస్తీతో గట్టిగా అదిమి పట్టి, ఒక పెద్ద సూట్కేసులో సాన్వీని దూర్చానని చెప్పాడు. ఇంట్లో దొరికిన ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను కూడా అదే సూట్కేసులో పెట్టానని వివరించాడు. సాన్వీని కిడ్నాప్ చేసిన తర్వాత తాను ఏమేమి చేసింది, సాన్వీ ఎలా చనిపోయింది వంటి అన్ని వివరాలను రఘు విచారణలో వివరించాడు.
తాను చేసిన నేరం పెద్దదే అని, అయితే తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని రఘు అటార్నీకి ఇచ్చిన వాంగ్మూలంలో అన్నాడు. క్షమించాలని అడిగే హక్కు కూడా తనకు లేదని అన్నాడు. అమెరికా కోర్టులో రఘునందన్పై అపహరణ, హత్య, దొంగతనం, తదితర 13 అభియోగాలను మోపారు.