మజ్లిస్ నోట జగన్ మాట: సభలో కిరణ్ X అక్బరుద్దీన్

Kiran Kumar Reddy - AKbaruddin Owaisi
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లు పైన చర్చ జరుగుతున్న సమయంలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్బరుద్దీన్ ప్రభుత్వంపై మాటల దాడి చేయగా కిరణ్ కుమార్ రెడ్డి వారి దాడిని తిప్పి కొట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందన్నారు.

సబ్ ప్లాన్‌తో దళితులను సర్కారు మోసం చేయాలని చూస్తోందని, వారి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సబ్ ప్లాన్ చారిత్రకమని కిరణ్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆయన సిఎం అయ్యాక ఎపెక్స్ కమిటీ ఒక్కసారి సమావేశం కాలేదన్నారు. సబ్ ప్లాన్స్‌లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డరులోనే ఉన్నాయన్నారు. మైనార్టీల నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెసు ప్రవేశ పెడితే మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్‌లలో ఎందుకు ప్రవేశ పెట్టలేదని ప్రశ్నించారు.

సబ్ ప్లాన్ బిల్లులో దళిత ముస్లింలు, క్రిస్టియన్ల గురించి లేదన్నారు. దళితులను, గిరిజనులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పేద ముస్లింలకు న్యాయం చేయాలన్నారు. పాతబస్తీలో మత ఘర్షణలు కిరణ్ ప్రభుత్వం కారణంగానే జరిగాయన్నారు. తాము సొంత బలం, ముస్లింల అండతో గెలిచామన్నారు. కిరణ్‌కు ఆగ్రహం వస్తున్నట్లుగా ఉందన్నారు. కాగా వైయస్ వల్లే అధికారంలోకి కాంగ్రెసు వచ్చిందని, ముస్లిం రిజర్వేషన్‌లు కాంగ్రెసు ప్రవేశ పెడితే ఇతర కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని జగన్ పార్టీ ఇంతకుముందు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను కిరణ్ తిప్పికొట్టారు. పాతబస్తీ అంశం సభలో ప్రస్తావించినప్పుడు సబ్ ప్లాన్ గురించి మాట్లాడుతుంటే ఇతర అంశాలు మాట్లాడటం సరికాదని, అయినా అక్కడ కోర్టు తీర్పు ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. తాము మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాంగ్రెసు కారణంగానే మజ్లిస్ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచిందని, అంతకుముందు రెండు సీట్లే ఉండేవని గుర్తు చేశారు.

కాంగ్రెసు పార్టీకి ఎవరి లౌకికవాద సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు సొంతబలం, ముస్లింలతో పాటు అన్ని వర్గాల అండతో అధికారంలోకి వచ్చిందన్నారు. తనకు ఆగ్రహం రావడం లేదన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని పరిశీలిస్తున్నామని, చర్చకు సిద్ధమన్నారు. ద్రోణం రాజు కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. చట్టంలో మార్పులు, చేర్పులకు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

వివక్ష ఇంకా పోలేదు

అంతకుముందు మాట్లాడిన లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సమాజంలో ఇంకా కుల వివక్ష పోలేదన్నారు. బడుగులకు ఓటు బ్యాంకు చూపి మరో బానిసత్వంలోకి నెట్టవద్దన్నారు. కుల వివక్షను తొలగించాలంటే విద్యను మించిన ఆయుధం లేదన్నారు. దళిత, గిరిజనుల విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. ఒక్కో విద్యార్థికి అదనంగా రూ.1000 నుండి రూ.1500 వరకు ఖర్చు చేయాలని సూచించారు.

అన్ని కులాలు కలిసి ఉండేలా గృహ నిర్మాణాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత గురించి భయపడుతూ కొన్ని వర్గాలు బానిసత్వానికి గురవుతున్ాయని, కులాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తే వివక్ష తగ్గుతుందన్నారు. సమాజంలోని దుర్మార్గుల నుండి బయటపడేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తాను భావిస్తూ మద్దతిస్తున్నానని జెపి చెప్పారు. సబ్ ప్లాన్ బిల్లు ద్వారా ఖర్చులో కాకుండా ఫలితం తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+