NEET Update: ఇకపై నీట్ పరీక్ష ఇలా..! కేంద్రం కీలక నిర్ణయం..!
ఈ ఏడాది వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష (NEET UG 2026) పేపర్ లీక్ తో లక్షలాది మంది విద్యార్ధులు షాకయ్యారు. రాజస్థాన్ లోని సికార్ లో జరిగిన ఈ లీక్ ను కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఎన్టీఏ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జూన్ 21న తిరిగి నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ఇవాళ ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరో కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ పరీక్షను ఆన్లైన్ విధానానికి మార్చాలని, తద్వారా ప్రస్తుత పేపర్ ఆధారిత విధానం నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి మారనున్నట్లు ఆయన వెల్లడించారు. నీట్ పరీక్ష వివాదం చుట్టూ వస్తున్న వదంతులను నమ్మవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే నీట్ పరీక్ష విషయంలో రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేశామని, అయితే అధికారుల్లో లోపం జరిగిందని మంత్రి అంగీకరించారు. ప్రభుత్వం ఈ లోపాన్ని అంగీకరిస్తుందని, వ్యవస్థను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని ప్రధాన్ వెల్లడించారు. పరీక్షలలో జరిగే అక్రమాలను నిర్మూలించాల్సిన సామాజిక దురాచారంగా ఆయన అభివర్ణించారు. స్వచ్ఛమైన, నిష్పక్షపాతమైన పరీక్షా ప్రక్రియను నిర్ధారించడానికి పౌరులు, విధాన రూపకర్తలు, సమాజం మద్దతివ్వాలన్నారు. ఈ విషయంపై సీబీఐ సమగ్ర దర్యాప్తు జరుపుతుందని, ఇందులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.













Click it and Unblock the Notifications