యూనివర్సిటీలలో పోస్టుల భర్తీ నోటిఫికేషన్.. దరఖాస్తులు అప్పటినుండే!
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు పెద్ద ఉపశమనంగా మారనుంది. ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు నేడు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
విశ్వవిద్యాలయాలలో ఖాళీ పోస్టులు ఇవే
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు ఆర్జీయూకేటీ (RGUKT)లో ఈ నియామకాలు జరగనున్నాయి.పోస్టుల వివరాలు మొత్తం 1,523 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020,అసోసియేట్ ప్రొఫెసర్ 334, ప్రొఫెసర్ 63 పోస్టులు, లెక్చరర్ 104 పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు 279 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్గా పని చేస్తున్న అధ్యాపకులకు అదనపు వెయిటేజ్ ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

దరఖాస్తు విధానం
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 18వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మొత్తం నియామక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా నిర్వహించనుంది. అభ్యర్థులు అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.గతంలో వచ్చిన కొన్ని నోటిఫికేషన్లను రిజర్వేషన్ రోస్టర్ వివాదాల వల్ల ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈసారి కొత్త విధానంతో సమస్యలు లేకుండా నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీహెచ్డీ పూర్తి చేసిన వేలాది మంది యువతకు శుభవార్త
రాష్ట్ర విభజన తర్వాత విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మంజూరైన 4,343 పోస్టులకు గాను కేవలం 972 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో బోధనా నాణ్యత, పరిశోధనలు, విద్యార్థుల అభివృద్ధి ప్రభావితమవుతున్నాయి. ఈ భారీ నియామకాలు విద్యా రంగాన్ని బలోపేతం చేసి, అకడమిక్ ఎక్సలెన్స్ను మెరుగుపరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన వేలాది మంది యువతకు ఇది పెద్ద అవకాశం.
ఉద్యోగార్థుల్లో భారీ స్థాయిలో ఆశలు
ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎక్కువగా ఉండటం యువ అభ్యర్థులకు ఊరట కలిగిస్తోంది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగార్థుల్లో భారీ స్థాయిలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన నియామకాలు పూర్తి చేసి, విశ్వవిద్యాలయాలను బలపరుస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఉన్నత విద్యా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications