మోడీకి ఎసరుపెడుతున్న విజయ్ ?-కేంద్రానికి AIADMK నేత బిగ్ అలర్ట్..!
తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి ఎంట్రీ ఇచ్చి, తొలి ప్రయత్నంలోనే సీఎం అయిన విజయ్ (Vijay) రోజురోజుకీ పాలనపై పట్టు బిగిస్తున్నారు. అదే సమయంలో తన నిర్ణయాల్ని జనం చర్చించుకునేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు కూడా చేయిస్తున్నారు. ఇదే క్రమంలో టీవీకే ఐటీ వింగ్ ఛీఫ్ నిర్మల్ కుమార్ పాత్ర కూడా కీలకంగా మారింది. దీంతో విపక్ష అన్నాడీఎంకే (AIADMK)కు చెందిన మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ (RB Uday Kumar) విజయ్, నిర్మల్ కుమార్ లపై బాంబుపేల్చారు.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 75 రోజులు పూర్తి కావస్తున్న తరుణంలో, అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్కుమార్ ప్రభుత్వంపై సంచలన విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేసి, సీఎం విజయ్ కేవలం సోషల్ మీడియా ప్రచారంతో ఒక కృత్రిమ మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2029 లోక్సభ ఎన్నికల్లో సీఎం విజయ్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉదయ్కుమార్ సంచలన విషయం వెల్లడించారు.

వివిధ భాషలకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా రీల్స్, వీడియోలను భారీగా విడుదల చేస్తూ విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను లేనిపోని విధంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కృత్రిమ ప్రచారాల వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహాన్ని గ్రహించి, దిల్లీలోని కేంద్ర పెద్దలు తక్షణమే అప్రమత్తం కావాలంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల రక్షణ, మాదకద్రవ్యాల బెడద, తీవ్రమైన విద్యుత్ కోతలు, రైతుల రుణాల మాఫీ, మేకేదాటు డ్యామ్ వివాదం లాంటి వందలాది సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నారు. అలాగే టీవీకేలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ వింగ్ నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ నిజానికి తమ పార్టీకి చెందిన రహస్య ఏజెంట్ (కోవర్ట్) అని, విజయ్ రాజకీయ ఇమేజ్, ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే తాము ఆయన్ను అక్కడికి పంపించామని సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications