కాచిగూడ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైలు- సింగిల్ ట్రిప్: హాల్ట్ స్టేషన్లు
వివిధ స్టేషన్ల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరో ప్రత్యేక రైలును ప్రకటించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతికి ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. కాచిగూడ నుంచి ఈ ఎక్స్ ప్రెస్ ఈ నెల 23వ తేదీన పట్టాలెక్కుతుంది. ఇది సింగిల్ ట్రిప్ ఎక్స్ ప్రెస్. కాచిగూడ నుంచి తిరుచానూరుకు వెళ్లి మళ్లీ తిరిగి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడుతుంది.

ఈ నెల 23వ తేదీన గురువారం రాత్రి 9: 30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07787 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11:50 నిమిషాలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు తిరుచానూరు నుంచి బయలుదేరే నంబర్ 07788 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఏసీ- 2 టయర్, ఏసీ- 3 టయర్, స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలు ఈ ఎక్స్ ప్రెస్ కు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని నివారించడంలో భాగంగా ఈ రైలును నడిపిస్తోన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications