తెలంగాణ: తెరపైకి 'ఫ్రంట్', కాంగ్ ఓకె టిడిపి విముఖం
తమ తమ పార్టీలోని నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండటంతో తామే ఓ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఆ ఫ్రంట్ నుండి పోటీ చేసి గెలుపొందితే బావుంటుందనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఫ్రంట్కు సుముఖంగా ఉన్న టిడిపి ఇప్పుడు మాత్రం ఆసక్తిగా లేదట. అయితే ఫ్రంట్ ఆలోచన కాంగ్రెసులో ప్రధానంగా నడుస్తోందని అంటున్నారు. తెలంగాణపై అధిష్టానం తేల్చనందున పార్టీలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని పలువురు ఆలోచిస్తున్నారట.
దీంతో ఫ్రంట్తో ముందుకు వెళ్లడమే బెట్టర్ అనే ఆలోచనలో ఉన్నారట. తద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలను నిరోధించవచ్చుననే భావనలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు మరెంతో దూరం లేని ఈ సమయంలోనే ఫ్రంట్ ఇప్పుడు ఏర్పాటు చేయడమే మేలని కొందరు సూచిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ కోసం తాము పోరాటం చేశామనే భావన ప్రజల్లో ఉందని, పార్టీని వీడి తెలంగాణ కోసం ఫ్రంట్ పెడితే మరింత లబ్ధి చేకూరుతుందనే భావనలో ఉన్నారట.
కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలోకి వెళ్లలేని వారు కూడా తమ వద్దకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారట. దీనిపై టిడిపి నేతలు ప్రస్తుతం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం వరకు వారు సుముఖంగానే ఉన్నారట. రెండు నెలల క్రితం ఫ్రంట్ ప్రతిపాదనకు ఓకే చెప్పామని, ఇప్పుడు ఆ ఆలోచన లేదని టిటిడిపి నేతలు చెబుతున్నారట.