ప్లకార్డ్: జగన్ ఫ్యామిలీకి 'తెలంగాణ' దెబ్బ, వీరికీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆయన సోదరి షర్మిల వరకు అందరూ 'తెలంగాణ' బాధితులే. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే కారణంతో సొంత కుంపటి పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో తన హవా కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వరుసగా తెలంగాణ సెగ తగులుతోంది. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు దివంగత వైయస్ చేసిన 'తెలంగాణకు వెళ్లాలంటే పాస్పోర్టు తీసుకోవాలంటే' వ్యాఖ్యలు, పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకున్న అంశం ఇంకా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వెంటాడుతున్నాయి.
జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేపట్టేందుకు వరంగల్ జిల్లా మహబూబాబాద్ వచ్చారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నందుకు అయనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు భారీగా రైల్వే స్టేషన్కు తరలి వచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేదాటకుండా జగన్ను వంగపల్లి వద్దనే అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణవాదులను తిప్పికొట్టేందుకు కొండా సురేఖ వర్గం ధీటుగా స్పందించింది. దీంతో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అప్పుడు రణరంగాన్ని తలపించింది.
వైయస్ విజయమ్మ ఇటీవల చేనేత దీక్ష కోసం కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు వెళ్లినప్పుడు ఆమెను హైదరాబాద్ నుండి సిరిసిల్ల వరకు అడుగడుగునా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సిద్దిపేట దాటాక ఆమె కాన్వాయ్ పైన దాడి కూడా జరిగింది. సిరిసిల్లలో దీక్ష సమయంలో ఓ మహిళ పోలీసు జీపు ఎక్కి మరీ చెప్పు చూపించింది.
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు చుక్కలు చూపించారు. రాళ్లు, గుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో ఆమె తన పాదయాత్రను ఆపేసి కొద్దిదూరం కారులో వెళ్లారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో పలుమార్లు తెలంగాణ సెగను ఎదుర్కొన్నారు. ఆయన చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు మాత్రం అంత పెద్దగా సెగ తగలలేదు. గతంలో మాత్రం భారీ పోలీసు భద్రత మధ్య ఆయన రైతు పోరు బాట యాత్ర చేయాల్సి వచ్చింది. అయితే బాబు చేపట్టిన వస్తున్నా మీకోసం అంతగా సెగ తగులక పోవడంతో తమకూ తగలదని జగన్ పార్టీ భావించింది. కానీ తలకిందులైంది. పాలమూరులో బాబు తెలంగాణ సెగ ఎదుర్కొన్నారు. కానీ ఇంతలా కాదు.
కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యవాదిగా ముద్రపడ్డారు. ఆయనకూ తెలంగాణ సెగ తగిలింది. సామాజిక న్యాయం పేరుతో ఆయన పిఆర్పీ స్థాపించి 2009 ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన సమయంలో తెరాస కార్యకర్తలు ఆయనపై గుడ్లు విసిరారు.
వైయస్ జగన్ సొంత పార్టీ స్థాపించక ముందే ఆయన తెలంగాణవాదుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత పార్టీ స్థాపించారు. తెలంగాణవాదులు పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా పట్టుకున్న ప్లకార్డు పైన ప్రశ్నిస్తే అది పార్టీ స్థాపించక ముందు అని, కాంగ్రెసు పార్టీ ఎంపీగా చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో తమకు తెలంగాణలో చుక్కెదురు కాదని వారు భావించారు.
పరిస్థితి బాగుంటే తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్ర చెపట్టేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు కూడా జగన్ తెలంగాణలో త్వరలో ఓదార్పు యాత్ర చేపడతారని ప్రకటించారు. అ తర్వాత అక్రమాస్తుల కేసులో ఆయన అరెస్టు కావడం జరిగింది. ఆ తర్వాత ఆయన తల్లి వైయస్ విజయమ్మకు కరీంనగర్ జిల్లాలో, సోదరి షర్మిలకు మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.