కావూరికి ప్రధాని బుజ్జగింపులు: నో చెప్పిన టి-ఎంపీలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పలువురు ఎంపీలు ఎఫ్డిఐ ఓటింగుకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకోవడంతో వారిని బుజ్జగించే పనిలో పడింది. ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తనకు పదవి రాకపోవడంతో ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ విప్ జారీ చేసినా తాను సమావేశాలకు హాజరయ్యేది లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు.
రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయనను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కావూరికి ఫోన్ చేసి రేపటి ఎఫ్డిఐ ఓటింగులో పాల్గొనాలని కోరారు. అయితే కావూరి ఏం చెప్పారో ఇంకా తెలియరాలేదు. విప్ జారీ చేసినా హాజరుకానని చెప్పినా కావూరి ప్రధాని బుజ్జగింపులకు మెత్తబడ్డారా లేదా తెలియరావాలి. ప్రధాని విజ్ఞప్తి మేరకు ఆయన ఓటింగులో పాల్గొంటారా అనే ప్రశ్న తొలుస్తోంది.
మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలు కేంద్రమంత్రులతో భేటీకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎఫ్డిఐ ఓటింగులో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనబోమని అధిష్టానానికి ఖరాఖండిగా చెప్పేశారు. తెలంగాణపై తేల్చుతామని హామీ ఇస్తేనే పాల్గొంటామని వారు కేంద్రమంత్రి కమల్ నాథ్కు చెప్పారు. తెలంగాణ అంశాన్ని తేల్చని పక్షంలో తాము దూరంగా ఉంటామన్నారు.