కొడాలి నానిపై రెచ్చిపోయిన బాలయ్య అభిమానులు
నాని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. బాలయ్య పైన నాని చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాని నందమూరి కుటుంబం పేరు చెప్పుకొని రూ.కోట్లు సంపాదించి, ఇప్పుడు వేరే పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. గుడివాడలో బాలయ్య పైన కాదు, సామాన్య టిడిపి కార్యకర్తను నిలబెట్టి నీపై గెలిపించుకుంటామని కొడాలి నానికి ప్రతి సవాల్ విసిరారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్ర్లాలో ఆస్తులు కూడబెట్టినట్లే నీవు కూడా ఇప్పటి నుంచే ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు పెంచుకునేందుకు ఆ మాట మాట్లాడుతున్నావా అని ఎద్దేవా చేశారు. బాలకృష్ణపై పిచ్చి కూతలు కూస్తే ఊరుకునేది లేదని నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్లు కూడా నాని పైన ధ్వజమెత్తారు.
బాలయ్యను విమర్శించే స్థాయి నానికి లేదన్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో రాజకీయంగా లబ్ధిపొంది ప్రస్తుతం వారినే విమర్శించడం తగదన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఎవరు డబ్బులిస్తే వారి వైపు మాట్లాడటం సరికాదన్నారు. డబ్బుకు ఆశపడి పార్టీని వదిలిన నీవు బాలయ్యను విమర్శిస్తావా, మీలాంటి వారికి ప్రజలు బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు.