సోనియా వర్సెస్ సుష్మా: 'గాంధీ'కి అవమానం.. బిఎస్పీ
ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బిఎస్పీలు కూడా గొంతు కలిపాయి. ప్రధాని 2002లో ఎఫ్డిఐలను వ్యతిరేకించారని, ఆయన తన నిర్ణయాన్ని ఎలా ఎందుకు మార్చుకున్నారో చెప్పాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. సోనియా, రాహుల్ పేర్ల వెనుక గాంధీ ఉంటుందని, ఆ మహాత్మా గాంధీ స్వదేశీ అంటే యూపిఏ మాత్రం విదేశీ అనటం సరికాదని ములాయం సింగ్ అన్నారు.
ఎఫ్డిఐలతో 20 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారని కానీ, చిన్న రైతులు, వ్యాపారులను సమాధి చేసే కుట్ర అని బిఎస్పీ ధ్వజమెత్తింది. ఎఫ్డిఐలకు అనుమతి విదేశీ వస్తువులను బహిష్కరించిన మహాత్మ గాంధీని అవమానించడమే అన్నారు. ఓటింగ్పై తమ వైఖరిని బుధవారం వెల్లడిస్తామన్నారు. ఈ ఎస్పీ, బిఎస్పీ ఓటింగ్ సందర్భంగా గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్డిఐలను వ్యతిరేకించినా ప్రభుత్వానికే తమ మద్దతని డిఎంకె ప్రకటించింది.
ఎఫ్డిఐలను అనుమతించడానికి ఫెమా తీర్మానాన్ని సవరించాలంటూ తృణమూల్ కాంగ్రెసు ఎంపి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అణు ఒప్పందం కానీ, ఎఫ్డిఐ నిర్ణయం కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే యూపిఏ ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. హిల్లరీ క్లింటన్ గతంలో వాల్మార్ట్ బోర్డు సభ్యురాలని, గత ఏడాది మేలో ఆమె ఢిల్లీలో ఉన్నారని, ఎఫ్డిఐలపై ప్రభుత్వాన్ని ఒప్పించారని విమర్శించారు.
ఓటింగ్ ఉన్నప్పటికీ తమకు ఎలాంటి ఆందోళన లేదని, విజయం సాధిస్తామని అధికార పార్టీ చెప్పింది. సభలో పలు సందర్భాలలో యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్ ఆగ్రహావేశాలకు ప్రదర్శించారు. సోనియా ఎఫ్డిఐలకు అనుకూలంగా, సుష్మ వ్యతిరేకంగా ఇతర పక్షాలపై మండిపడ్డారు.