తేల్చేసిన ఆజాద్: తెలంగాణపై మళ్లీ అదే తంతు
హైదరాబాదులోని హైటెక్స్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆజాద్ తెలంగాణపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని, ఆ అభిప్రాయాలు తెలుసుకోవడానికే సమావేశమని ఆయన చెప్పారు. సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఎంత మంది హాజరు కావాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు జానారెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు.
ఆజాద్ ప్రకటనను బట్టి అఖిల పక్ష సమావేశానికి పార్టీల వైఖరిని తెలుసుకోవాడానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించడం లేదనేది స్పష్టమైంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించడానికి కూడా కేంద్రం సిద్ధంగా లేదని తెలిసిపోయింది. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోస్యమే నిజమయ్యేట్లుంది. ఎఫ్డిఐలపై ప్రతిపక్ష బిజెపి ప్రతిపాదించిన తీర్మానాన్ని లోకసభలో గట్టెక్కడానికి మాత్రమే తెలంగాణ ఎంపిలను నమ్మించారని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వంటి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు నిజం కాబోతున్నట్లే అనిపిస్తోంది.
ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో తమ వైఖరిని చెప్తామని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో స్పష్టమైన వైఖరి చెప్పడానికి ఆ పార్టీ సిద్ధమైనట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన తెలియజేస్తోంది.
తెలంగాణకు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. కేంద్రం నిర్వహించ తలపెట్టిన అఖిల పక్ష సమావేశంపై స్పష్టత లేదని ఆయన కరీంనగర్లో అన్నారు. ఎఫ్డిఐలపై ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెసు తెలంగాణ ఎంపిలతో ఓటు వేయించుకోవడానికే కేంద్రం ఆ నాటకం ఆడుతోందని ఆయన అన్నారు.
కాగా, కేంద్ర నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హాజరు కావాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్ దామోదర రెడ్డి డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని, ఎక్కువ మందిని పిలిస్తే పార్టీ వైఖరి వెల్లడి కాదని, తెలంగాణపై స్పష్టత రాదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలు అడిగి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. తమకు అవకాశం వస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సూచిస్తామని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు.