కోల్డ్వార్: హరికృష్ణ వర్సెస్ బాలకృష్ణ (ఫోటోలు)
హైదరాబాద్:
తెలుగుదేశం
పార్టీలో
వారసత్వ
పోరు
సద్దుమణిగినట్లు
కనిపిస్తున్నట్లు
అనిపిస్తున్నప్పటికీ
అది
లోలోన
రగులుతున్నట్లు
చెబుతున్నారు.
నందమూరి
హీరో,
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబు
నాయుడి
వియ్యంకుడు
బాలకృష్ణ
ఇటీవలి
గుడివాడ
పర్యటనలో
మరోసారి
వారసత్వ
పోరుకు
సంబంధించిన
చర్చ
మళ్లీ
ప్రారంభమైంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికలకు ముందు ప్రచారానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసినట్లు చెబుతారు. దీంతో నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమైనవాడిగా మారిపోయారు. ఎన్టీ రామారావుకు నందమూరి హీరోలందరితో కలిసే నివాళులు అర్పించేవారు.
చంద్రబాబు నందమూరి హీరోలందరితో కలిసి కార్యాచరణను, కార్యక్రమాలను రూపొందించుకుంటూ వచ్చారు. వారితో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను పూర్తిగా తనకు దగ్గరగా ఉంచుకోవడానికి తన సన్నిహిత కుటుంబానికి చెందిన లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్కు దగ్గరుండి వివాహం జరిపించారు.
జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణే తనకు ప్రాణమన్నట్లుగా వ్యవహరించేవారు. నోటి నిండా బాబాయ్ అంటూ మాట్లాడేవారు. గత కొంత కాలంగా వీరిద్దరు ఒక్క వేదిక మీదికి రావడం లేదు. కానీ, బాబాయ్ పోటీ చేస్తే తాను ప్రచారం చేస్తానని ఇటీవల ప్రకటించారు. అది ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు.
తండ్రి హరికృష్ణే తనకు సర్వస్వం అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసే నారా లోకేష్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు చేస్తున్నట్లు చెబుతున్నారు.
బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక ముందు, పార్టీలో అంతర్గత పోరు ప్రారంభం కాక ముందు హరికృష్ణ ఆయనకు దగ్గర ఉండేవారు. సోదరుల మధ్య అనురాగబంధం వెల్లి విరుస్తున్నట్లు ఉండేది. బాలయ్య గుడివాడ పర్యటన సందర్భంగా అంతా బాగు లేదని బయటపడిందని అంటున్నారు.
ఇటీవల హరికృష్ణ చంద్రబాబుకు దగ్గరైనట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా విభేదాలను విస్మరించి హరికృష్ణ వ్యవహరించారని అనుకున్నారు. కానీ, అది బయటకు మాత్రమేనని అంటున్నారు. పార్టీని కాపాడుకోవడం కాపాడుకోవడమే అంతర్గత పోరు సాగించడం సాగించడమేననే పద్ధతిలో హరికృష్ణ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు దృష్టిలో హరికృష్ణకు ప్రత్యామ్నాయంగా బాలయ్య అని అంటున్నారు. బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.
విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో నడిరోడ్డు మీద ముచ్చట పెట్టడంతో నందమూరి కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నట్లు చెబుతారు. వంశీ పార్టీని వీడుతారని భావించినప్పటికీ రాజీకి వచ్చి కొనసాగుతున్నారు. అయితే, ఆయన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాటల ప్రకారమే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
వంశీతో కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా చెబుతారు. కొడాలి నాని తెలుగుదేశం పార్టీకి నమస్కారం పెట్టేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. గుడివాడలో బాలకృష్ణను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా రగిలిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
బాలకృష్ణ పర్యటనలో హీరో జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడైన తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ కనిపించకపోవడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నిజానికి, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు, హరికృష్ణకు మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందని అంటున్నారు. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం హరికృష్ణకు నచ్చడం లేదని చెబుతున్నారు.
చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్కు అప్పగించాలనే ప్రయత్నాలతోనే వారు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఈ విభేదాలు సద్దుమణగినట్లు కనిపించినా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ రాజకీయాలకు పదును పెడుతూనే ఉన్నారని అంటున్నారు. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ వ్యూహం, తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకోవాలనే తపన ప్రస్తుత ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమని చెబుతున్నారు.