విశాఖపట్నం సీటు: పురంధేశ్వరికి టిఎస్సార్ సెగ
వచ్చే లోకసభ ఎన్నికల్లో విశాఖపట్నం స్థానం నుంచి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరిని నిలబెట్టవద్దని కాంగ్రెసు కార్యకర్తలు కొంత మంది ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పంపించన దూతల వద్ద విన్నవించుకున్నారు. రాహుల్ పంపించిన ఇద్దరు దూతల్లో ఒకరైన గోవా శాసనసభ్యుడు జితేందర్ సింగ్ ప్రభుదాస్ బుధవారం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం లోకసభ స్థానం గురించి అభిప్రాయాలు సేకరించారు.
పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రధాన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పురంధేశ్వరికి విశాఖపట్నం సీటు ఇవ్వవద్దని ఎక్కువ మంది కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. తనకు విశాఖపట్నం సీటు కావాలంటూ చాలా కాలంగా టి. సుబ్బిరామిరెడ్డి కోరుతున్నారు.
సీటు వ్యవహారంలో సుబ్బిరామిరెడ్డికి, పురంధేశ్వరికి మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధమే కాకుండా మాటల సమరం కూడా కొనసాగుతోంది. కాగా, అనకాపల్లి లోకసభ స్థానం అనకాపల్లిలో జరిగిన సమావేశంలో కొందరు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు పేరును, మరికొంత మంది డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పేరను సూచించారు.