ఆజాద్ తెలంగాణ ప్రకటన: జగన్, బాబులకు రిలీఫ్

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై అఖిల పక్ష సమావేశం భేటీపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊరట లభించింది. ఈ నెల 28వ తేదీన తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో కొత్తగా ఏమీ జరగబోదని ఆజాద్ తేల్చేశారు. తెలంగాణపై అవగాహన కోసం మాత్రమే అఖిలపక్ష సమావేశం జరుగుతుందని ఆజాద్ గురువారం సాయంత్రం చెప్పారు. ఆజాద్ ప్రకటన వచ్చే వరకు అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే పిలుస్తారని, అప్పుడు ప్రతి పార్టీ కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాల్సి ఉంటుందని అందరూ భావించారు.

పార్టీల వైఖరిని స్పష్టంగా తెలుసుకోవడానికి కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదని ఆజాద్ చెప్పేశారు. మరోవైపు, కాంగ్రెసు తన వైఖరిని అఖిల పక్ష సమావేశంలో చెప్పబోదని, ఇతర పార్టీల అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం మరింతగా స్పష్టత ఇచ్చారు. దీంతో తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి చంద్రబాబు, వైయస్ జగన్ వచ్చి ఉంటారు. దాంతో గాలి పీల్చుకుని ఉంటారు.

ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరి వెల్లడించిన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు. దీంతో కాంగ్రెసు తన వైఖరిని స్పష్టం చేస్తూ ఇతర పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధిని మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించి ఉంటే చంద్రబాబు, జగన్ స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు కోరారు కాబట్టి ఆ సమావేశాన్ని బహిష్కరించే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి ఉండేది కాదు.

ఇకపోతే, తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆయన గురువారంనాడే హైదరాబాదు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు తెలుస్తోంది. అందుకే, అఖిల పక్ష సమావేశం తేదీ కూడా పూర్తిగా ఖరారు కాలేదని ఆజాద్ అన్నారు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నందు వల్ల సమావేశాన్ని వాయిదా వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి రేపు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశాన్ని వాయిదా వేయించేందుకు పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+