నేను శ్రమిస్తుంటే మీరు ఇలా: బాబు, దేవేందర్ సాకులు
"పాదయాత్ర చేస్తూ నేను ఇలా శ్రమిస్తూ ఉంటే మీరు ఇలా చేస్తారా?" అని చంద్రబాబు ఎంపిలపై మండిపడ్డారు. అయితే, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు మాత్రం సాకులు చెబుతున్నారు. బిఎస్పీ అధినేత మాయావతి ప్రభుత్వానికి మద్దతు పలకడంతో ఎలాగైనా ప్రభుత్వం గెలుస్తుందని తాము తేలిగ్గా తీసుకున్నామని రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ అన్నారు.
డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి తాను రాజ్యసభకు ఆ సమయంలో వెళ్లలేకపోయానని ఆయన అన్నారు. ముగ్గురు సభ్యులు వివరణ ఇచ్చిన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసే విషయంపై ఆలోచన చేస్తామని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. రమేష్తో పాటు నందమూరి హరికృష్ణ మాత్రం రాజ్యసభకు హాజరయ్యారు.
ముగ్గురు సభ్యులు కూడా వ్యక్తిగత కారణాల వల్లనే సభకు హాజరు కాలేదని సిఎం రమేష్ చెప్పారు. బిఎస్పీ నేత మాయావతి ప్రభుత్వానికి మద్దతు పలకడంతో తమ సభ్యులు ఓటింగును తేలిగ్గా తీసుకున్నారని ఆయన చెప్పారు. ముగ్గురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంపై ముందు చంద్రబాబుకు తెలియదని, తాను చెప్పిన తర్వాతనే తెలిసిందని ఆయన అన్నారు.