ఇప్పుడే ఇలా దాడులు, విడిపోతే తిరగలేం: లగడపాటి

హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని, ప్రజల సొత్తు అని ఆయన అన్నారు. విడిపోతే హైదరాబాదులో తిరగగలిగే పరిస్థితులున్నాయా అని ఆయన అడిగారు. మూడేళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన అన్నారు. వేర్పాటు ఉద్యమంలో కేవలం 100 నుంచి 150 మంది విద్యార్థులు మాత్రమే పాలు పంచుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే రెండు కాదు, ఎక్కువ భాగాలు అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్రం ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి తమను కూడా ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేసారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు 270 స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో భావోద్వేగాలు తగ్గిపోయాయని, రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే దాడులు జరుగుతున్నాయని, విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్ని పార్టీలు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని కొందరు అందలం ఎక్కాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు అఖిల పక్ష సమావేశంలో కూడా రెండో ఎస్సార్సీ గురించే చెబుతుందని, పార్టీ విధానం మారాలంటే మళ్లీ సిడబ్య్లుసిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంతో ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. ప్రధాన పార్టీలు కోరితేనే రాష్ట్రం విడిపోతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 65 శాతం మంది సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు పాదయాత్ర చేసి సమైక్యాంధ్ర కోసం రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు.
కాగా, సమైక్యాంధ్ర జెఎసి సమావేశం కొన్ని తీర్మానాలు చేసింది. జనవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పాదయాత్రల ద్వారా సమైక్యాంధ్ర నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అనుకుంది.












Click it and Unblock the Notifications