బాబుపై ఒత్తిడి: ఎంపీల తీరుపై పార్టీ నేతల ఫైర్

ఎఫ్డిఐలపై ఓటింగులో తమ ఎంపీలు పాల్గొనకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. అది బాధాకరమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎంపిలు చేసిన తప్పునకు వారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గైర్హారైన ఎంపీలు ముగ్గురు పార్టీకి, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ముగ్గురు పార్లమెంటు సభ్యుల వల్ల లక్షలాది కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. పార్టీ విధివిధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం సరి కాదని, వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి నష్టం కలిగించడం సరైంది కాదని ఆయన అన్నారు. ముగ్గురు ఎంపిలపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కాలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎంపీలు రాజ్యసభకు హాజరు కాకపోవడం దురదృష్టకరమని ఆయన శనివారం వరంగల్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎంపీల గైర్హాజరీపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నారని చెప్పారు. ఎంత వ్యతిరేకత ఎదురైనా వారికి రాజ్యసభ సీట్లిచ్చామని, వారు పార్టీకి ద్రోహం చేశారని ఆయన అన్నారు.
రాజ్యసభకు పార్టీ ఎంపిలు హాజరు కాకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. షాక్ నుంచి తమ పార్టీ ఇంకా కోలుకోలేదని కడియం శ్రీహరి అన్నారు.












Click it and Unblock the Notifications