ఎంపిల డుమ్మా: బాబును టార్గెట్ చేసిన జగన్ పార్టీ
తన మీద కేసులు లేకుండా చూస్తే ప్రభుత్వాన్ని కాపాడుతానని చంద్రబాబు కాంగ్రెసుతో ఒప్పందం చేసుకున్నారని, కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎంపి సుజనా చౌదరి చంద్రబాబు ఆత్మ అని, చంద్రబాబుకు తెలియకుండా ఆత్మ లోకసభకు గైర్హాజరు కాలేదని ఆయన అన్నారు. తనను కాంగ్రెసు పార్టీ మేనేజ్ చేయలేదని దేవేందర్ గౌడ్ చెబుతున్నారని, అంటే చంద్రబాబు చెప్పడం వల్లనే గైర్హాజరయినట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.
ఎఫ్డిఐలపై ఓటింగు జరుగుతున్నప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులు సభకు హాజరు కాకపోవడం చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు చక్కని ఉదాహరణ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే, వైయస్ జగన్ను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆయన శనివారం గుంటూరులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా కాంగ్రెసుకు ఎలాంటి నష్టం కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెసు అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం సహకరించిన విషయం అందరకీ తెలిసిందని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీని వీడినప్పటి నుంచి చంద్రబాబు కాంగ్రెసుతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.