తెలంగాణ: సోనియా ఇంటి ముట్టడి యత్నం, లాఠీఛార్జ్
ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థులు కాసేపటికి సోనియా నివాసం అయిన టెన్ జనపథ్ వైపుకు చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డగించారు. తాము సోనియా నివాసాన్ని ముట్టడించి తీరుతామని విద్యార్థులు అన్నారు. వారు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు వారి పైన లాఠీఛార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 2009 డిసెంబర్ 9వ తేదిన కేంద్రం చేసిన ప్రకటనకు కట్టిబడి ఉండాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన కాంగ్రెసు ప్రభుత్వం ఆ తర్వాత సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన ప్రకటనను అదే నెల 23న వెనక్కి తీసుకుందని ఆరోపించారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. విద్యార్థులు జెఏసి జెండాలు పట్టుకొని ఆందోళన చేశారు.
కాగా మరోవైపు ఈ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడంతో టెన్ జనపథ్ కోలాహలంగా మారింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెసు నేతలు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెసు నేతలు తమ అధినేత్రి పుట్టిన రోజును జరుపుతున్నారు. మరోవైపు ఏఐసిసి కార్యాలయం ఎదుట కూడా విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.