నావల్లే: యడ్డీ నోట జగన్ మాట, 10 మంది ఎమ్మెల్యేలు
తన మాతృ పార్టీ భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరారు. బిజెపికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి జనంలోకి రావాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో జగదీష్ శెట్టార్ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. తన మద్దతుదారుల వల్లనే బిజెపి రాష్ట్రంలో మనుగడ సాగిస్తోందన్నారు. ఎపి రాజకీయాల్లో గతంలో జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వల్లే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నిలబడుతోందన్నారు. ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో యడ్డీ అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
తనపై బిజెపి అధిష్టానం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తన మద్దతుదారులు ఎవరూ పార్టీ నుండి ఇప్పుడు బయటకు రారన్నారు. వారిని వైదొలగాలని తాను ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదన్నారు. తన కారణంగానే ప్రభుత్వం నిలబడిందన్నారు. బిజెపికి దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా యడ్యూరప్ప హవేరీలో బహిరంగ సభను ఏర్పాటు చేసి బిజెపికి తన బలాన్ని చూపించారు.
యడ్యూరప్ప సభలో వేదికపై అధికార పార్టీకి చెందిన దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నప్పటికీ వేదిక పైకి రానట్లుగా చెబుతున్నారు. యడ్డీ సభలో బిజెపి తనకు చేసిన మోసం గురించి వివరిస్తున్నారు. కాగా యడ్యూరప్ప బయటకు వెళ్లి పోవడంతో ప్రభుత్వాన్ని రక్షించుకునేందికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది.