ఎన్టీఆర్ విగ్రహంపై బాబుకు యార్లగడ్డ కౌంటర్
2000 నాటి విగ్రహాల కమిటీ ప్రొసీడింగ్సును ఆయన బయటపెట్టారు. ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు విగ్రహాలు పెట్టాలని ఎర్రంనాయుడు చెప్పారని లేఖలో చంద్రబాబు చేసిన ప్రస్తావనలో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. లేఖలోని అంశాలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపనపై చంద్రబాబుకు, కేంద్ర మంత్రి పురంధేశ్వరికి మధ్య లేఖ యుద్ధం కొనసాగుతుండగా, ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి మధ్యలోకి వచ్చారు. భార్యనైన తన సంతకం లేకుండా ఎన్టీఆర్ విగ్రహానికి ఎలా అనుమతి పొందుతారంటూ ఆమె విరుచుకుపడ్డారు. అటు పురంధేశ్వరిపై, ఇటు చంద్రబాబుపై ఆమె విమర్శలు చేశారు.
తన భర్త ఎన్టీఆర్ను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని ఆమె పురంధేశ్వరి, చంద్రబాబులను కోరారు. చంద్రబాబు ఆయనకు భారతరత్న రాకుండా నీచ రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. మరోసారి ఇలాంటి రాజకీయాలకు పాల్పడితే ఊరుకునే సమస్య లేదన్నారు. కాంగ్రెసు పార్టీని ఎదిరించి బయటకు వచ్చాడు కనుకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తున్నానని చెప్పారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కూడా ఆయన సాన్నిహిత్యం ఉంది.