బెంగాల్ అసెంబ్లీలో పిడిగుద్దులు: ఎమ్మెల్యేకు గాయాలు
రాష్ట్రంలోని చిట్ఫండ్స్ను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై తక్షణ చర్చకు వామపక్ష సంఘటన సభ్యులు వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దీంతో సభలో రగడ ప్రారంభమైంది. స్పీకర్ బిమన్ బెనర్జీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ఇరు పక్షాలు కలబడి ముష్టియుద్ధానికి దిగాయి. దీంతో సభ వాయిదా పడింది.
వామపక్ష శాసనసభ్యులు అంజాద్ హుస్సేన్, నజీబుల్ హక్, సుశాంత బెస్రాలను స్పీకర్ ఒక రోజు కోసం శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. నిరసనగా కాంగ్రెసు, వామపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తక్షణ సమస్యలపై తాము వాయిదా తీర్మానాలు ప్రతిపాదిస్తుంటే చిన్న చిన్న కారణాలతో వాటిని తోసిపుచ్చుతున్నారని ప్రతిపక్ష నాయకుడు, సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు సుర్జ్యా కాంతా మిశ్రా అన్నారు.
తృణమూల్ కాంగ్రెసు సభ్యుల దాడిలో తమ శాసనసభ్యుడు గౌరంగ ఛటోపాధ్యాయ్ గాయపడి ఆస్పత్రి పాలైనట్లు మిశ్రా తెలిపారు. తమ మహిళా సభ్యురాలు దేబొలెనా హేమాబ్రమ్పై చేయి చేసుకున్నారని, ఆమెను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఆరోపించారు.
తమ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణిస్తూ, సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘటన సభ్యులు శానససభ వెలుపల ప్రదర్శనకు దిగారు. తమ సభ్యుల్లో కొంత మంది ఏడుస్తున్నారని, తమ భద్రతకు ముప్పు ఉందని, దాంతో తాము సభకు ఈ రోజు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నామని కాంగ్రెసు నేత మానస్ భూనియా అన్నారు.