అందరూ కలిస్తే సోనియా అమ్మ దిగొస్తుంది: నాగం
తెలంగాణ అంశాన్ని సాగదీయడానికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సాగదీత కోసమే కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. అఖిల పక్ష సమావేశానికి ఇద్దరేసి ప్రతినిధులు వెళ్లినా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకే వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణపై అఖిల పక్ష సమావేశం తీరును బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తప్పు పట్టారు. పార్లమెంటు సభ్యులు అడిగితే అఖిల పక్ష సమావేశాన్ని పెడుతున్నామని హోం మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొనడం ఏమిటని ఆయన అడిగారు. కేంద్ర ప్రభుత్వ తీరు అనుమానాలకు తావు ఇస్తోందని ఆయన అన్నారు అఖిల పక్ష సమావేశం విషయంలో జాతీయ పార్టీని అడిగి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను అహ్వానించడంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు ప్రతినిధులు వెళ్తే తెలంగాణ సమస్య పరిష్కారం కాదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, భాను ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రతి పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి షిండే అంగీకరించినట్లుగా ఉందని వారు బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పార్టీకి ఒక్కరి చొప్పున పిలుస్తూ మళ్లీ లేఖలు రాయాలని వారు డిమాండ్ చేశారు.