దిగొచ్చిన ఎంపి సుజనా చౌదరి: సారీ చెప్పారు
ఎఫ్డీఐలపై రాజ్యసభలో ఓటింగ్ వివాదంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయని, తన తాహతు తెలియక కొంతమంది పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి తీరుపై తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఆయనతో పాటు కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి మరికొంత మంది శాసనసభ్యులు కూడా సుజనా చౌదరి తీరును తప్పుపట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. అటు కేశవ్తో, ఇటు సుజనా చౌదరితో ఆయన మాట్లాడారు. శాసనసభ్యుల మాటల్లో తప్పేమీ లేదని, పార్టీ శ్రేణుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యులు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు సంయమనం వహించి ఉండాల్సిందని చంద్రబాబు సుజనా చౌదరితో అన్నట్లు సమాచారం.
చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని చెప్పడంతో సుజనా చౌదరి మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు కేశవ్, దయాకర్ రెడ్డిలకు ఫోన్లు చేసి తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారని అంటున్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.