ఇద్దరు రావచ్చు: తెలంగాణపై షిండే అదే తంతు
సుశీల్ కుమార్ షిండే తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి కాంగ్రెసు తెలంగాణపై మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇద్దరేసి ప్రతినిధులను పిలవడం ద్వారా తెలంగాణను నాన్చే ధోరణి మాత్రమే కనిపిస్తోందని ఆయన అన్నారు. ఎఫ్డిఐలవంటి విషయాల్లో పార్టీలు కచ్చితమైన వైఖరులు తీసుకున్నట్లుగా తెలంగాణపై కూడా తీసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణకు సీమాంధ్ర ప్రజలు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు వ్యతిరేకంగా లేరని ఆయన అన్నారు. విడిపోయి కలిసి ఉండడానికి వీలుగా నిర్ణయం వెలువడాలని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఒక్క ప్రతినిధిని మాత్రమే పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ప్రజలు భూస్తాపితం చేస్తారని ఆయన అన్నారు.
పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడాన్ని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వ్యతిరేకించారు. తెలంగాణపై నాన్చుడు ధోరణికే ఈ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలంగాణపై అధికారంలో ఉన్న కాంగ్రెసు తన వైఖరి చెప్పకుండా ఇతర పార్టీలు చెప్పాలని అడగడం సరి కాదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం విషయంలో తాము అనుసరించే వైఖరిపై చర్చలు జరిపి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెసు కుట్ర చేసిందని ఆయన అన్నారు.
కాగా, తమకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా లేఖ రాలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. లేఖ అందిన తర్వాత చూసి తాము స్పందిస్తామని ఆయన చెప్పారు. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను పంపించడం వల్ల అఖిల పక్ష సమావేశంలో తేలేదేమీ ఉండదని గత సమావేశం ద్వారానే తెలిసిపోయింది. ముఖ్యంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో గతంలో ఇద్దరేసి ప్రతినిధులను పంపించి, అటు సమైక్యవాదాన్ని, ఇటు తెలంగాణ వాదాన్ని వినిపించాయి. పార్టీపరంగా వైఖరిని వెల్లడించకుండా ఇద్దరేసి ప్రతినిధులను పంపించడం వల్ల అఖిల పక్ష సమావేశం తంతుగా మాత్రమే సాగుతుందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట.