చెప్పగలరా: జగన్పై దుమ్మెత్తిపోసిన నారా లోకేష్
జగన్ బెయిల్పై బయటకు వస్తారని మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారని గుర్తు చేస్తూ నిర్దోషిగా జగన్ బయటకు రాగలరని చెప్పగలరా అని ఆయన నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిన జగన్ ఎఫ్డిఐల విషయంలో ఓటింగులో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. దానికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఓ పెద్ద జోక్ అని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ స్వీప్ చేస్తుందని తమ సర్వేల ఆధారంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పుకుంటోందని, అటువంటప్పుడు శానససభ్యులను కొనుగోలు చేయాల్సిన పని ఏముందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులు ఇచ్చారా, దొంగ సర్వేలకు ఎక్కువ ఖర్చు చేశారా అంటూ ఆయన వ్యంగ్యాస్త్రం విసిరారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా ఆయన వదిలిపెట్టలేదు. నాన్న పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత కెసిఆర్ అకస్మాత్తుగా నిద్ర లేచి, విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని అంటున్నారని, రేపు నిద్రలేచాక చింతిస్తారు లే అని లోకేష్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.
చంద్రబాబు పాదయాత్రపై ఆయన ట్విట్టర్లో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నాన్న పాదయాత్ర అనంతరపురంలో జరుగుతుండగా ఆ జిల్లాలో వర్షం పడదని పిల్ల కాంగ్రెసు (వైయస్సార్ కాంగ్రెసు) రూ. 25 లక్షలు పందెం కట్టిందని, అక్కడ వర్షం పడిందని, ఆ డబ్బును పేదల కోసం ఖర్చు పెట్టాలని లోకేష్ అన్నారు.