తెలంగాణకు టిడిపి ఓకే కానీ: బాబుపై పొన్నం సందేహం
ఈ నెల 28న జరగున్న అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ కోరారు. ఈ సమస్యను కొలిక్కి తీసుకు వచ్చేందుకు అన్ని పార్టీల వారు, అన్ని పార్టీల అధ్యక్షులు చిత్తశుద్ధితో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం రాత్రి తనను కలిశారని, తనను పార్టీలోకి ఆహ్వానించారని వివేక్ చెప్పారు. తనతో పాటు తెలంగాణ వ్యతిరేక పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులను అందర్నీ తన పార్టీలోకి రమ్మన్నారని చెప్పారు. ఈ అఖిల పక్ష సమావేశం సమస్య సానుకూల పరిష్కారం అయ్యే దిశలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశానికి ముందే వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు అభిప్రాయం చెప్పాలన్నారు.
అంతకుముందు వారు జానా రెడ్డితో భేటీ అయ్యారు. అఖిల పక్షంలో ఏకాభిప్రాయం వస్తుందని జానా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న షర్మిల, చంద్రబాబులు అఖిల పక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. ఏదో ఒక రాజకీయ పార్టీ బలోపేతం అయితే తెలంగాణ రాదని మధుయాష్కీ అన్నారు. 2014లో రాజకీయ భవిష్యత్తు కంటే తెలంగాణే తమకు ముఖ్యమన్నారు.
అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుండి ఇద్దరు చొప్పున పిలవడం సరికాదని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీల వల్లే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడం సరికాదన్నారు. తమ వ్యాఖ్యలతో ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్లు సీమాంధ్ర ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.