అక్కపై బాలయ్య ఘాటు వ్యాఖలు: బాబుకు చేటు
పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపన అనేది పార్టీ వ్యవహారం కాదని తేల్చేయడానికి నందమూరి కుటుంబ సభ్యులు దాదాపుగా తేల్చేసి, పురంధేశ్వరికి మద్దతుగా నిలబడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు మాట నెగ్గే పరిస్థతి లేదని అంటున్నారు. బాలకృష్ణ ప్రకటనను ఆసరా చేసుకుని తెలుగుదేశం నాయకులు పురంధేశ్వరిపై విమర్శనాస్త్రాలు సంధించడం కూడా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు మింగుడు పడడం లేదని అంటున్నారు.
బుచ్చయ్య చౌదరి, రేవంత్ రెడ్డి వంటి తెలుగుదేశం నాయకులు విగ్రహ ప్రతిష్టాపన వివాదంలో తల దూర్చి పురందేశ్వరిని విమర్శించారు. దీంతో కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఆవేదన చెందినట్లు సమాచారం. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాలయ్య పేరు మీద వెలువడిన ప్రకటనను తయారు చేశారని అంటున్నారు. ముందు తరంలోని కుటుంబ సభ్యుల మధ్య ఉండే సున్నితమైన సంబంధ బాంధవ్యాలను, మానసిక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే లోకేష్ ప్రకటనలో తీవ్రమైన వ్యాఖ్యలను పొందుపరిచినట్లు చెబుతున్నారు.
కాగా, బాలకృష్ణ స్వయానా తనకు మామ కావడంతో కూడా లోకేష్ స్వేచ్ఛ తీసుకుని ఉండవచ్చునని అంటున్నారు. నిజానికి, నందమూరి హరికృష్ణ వెలువరించే ప్రకటనలు కూడా పార్టీ కార్యాలయంలోనే తయారవుతాయి. పార్టీ కార్యాలయ ప్రతినిధులే విడుదల చేస్తారు. బహుశా, వాటిని మీడియాకు విడుదల చేసే ముందు చదివి వినిపిస్తూ ఉండవచ్చు. అయితే, బాలకృష్ణ విషయంలో అలా చదివి వినిపించారా, లేదా అనేది సంశయమే.
బాలకృష్ణ చూసి వుంటే, విషయాన్ని మటుకు అంగీకరించి, ఘాటు వ్యాఖ్యలను అంగీకరించేవారు కారని చెబుతున్నారు. సోదరి పురంధేశ్వరి పట్ల బాలయ్యకు ఆరాధనా భావం ఉందని అంటారు. అటువంటప్పుడు రాజకీయ కారణాల కోసం అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేమని అంటున్నారు. అయితే, ఆ ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు ప్రయోజానాన్ని దెబ్బ తీసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులంతా ఒక్కటైతే చంద్రబాబు చేసేదేమీ ఉండదు.
పైగా, ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. అంటే, ఆయన నందమూరి కుటుంబ సభ్యులందరి తరఫున మాట్లాడినట్లు చెప్పవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపన అనేది రాజకీయ రంగు పులుముకోకుండా ఉండాల్సిందనేది నందమూరి అభిమానుల అభిప్రాయం.