జగన్ విజృంభణ: మేల్కోన్న కెసిఆర్, బాబు విస్తరిస్తే..

K Chandrasekhar Rao- YS Jagan
హైదరాబాద్: తెలంగాణలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజృంభన గమనించి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మేల్కొన్నట్లే కనిపిస్తున్నారు. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు తొవ్వ పట్టినట్లు గమనించిన ఆయన దానికి అడ్డుకట్ట వేసే వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడ్డారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రమే కాకుండా కింది స్థాయి క్యాడర్ కూడా తెలంగాణలో జగన్ వైపు మళ్లుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు కెసిఆర్‌కు అత్యంత సన్నిహితులైన కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి చాలా రోజుల క్రితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా ఆ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెసు పార్టీ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా జగన్ వైపు మళ్లారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏదీ తేల్చకపోతే తమవైపు వస్తారని భావించిన తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైయస్ జగన్ పార్టీనే ప్రత్నామ్నాయంగా ఎంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

నల్లగొండ డిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ (మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) మాత్రమే కాకుండా నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు బలమైన సంకేతాలు అందాయి. తెరాసలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని, ఒక రకంగా పార్టీలో అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

నిజానికి, రెడ్డి సామాజిక వర్గం కలిసి రాకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కూడా అసాధ్యమైన భావన ఉంది. వీరంతా రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం కింద పనిచేయడానికి సిద్ధపడుతున్నారే తప్ప (కాంగ్రెసు అయినా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అయినా) తెరాసలోకి రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని తిరిగి తన వైపు తిప్పుకోవడానికి కెసిఆర్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుని అమలు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా తెలంగాణ సమరభేరీ బహిరంగ సభలో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారిని పేరు పేరునా తన ప్రసంగంలో ప్రస్తావించారు. అలాగే, ఇటీవల తెలంగాణకు చెందిన కొండా వెంకట రంగారెడ్డి పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని ఆయనను విశేషంగా ప్రస్తుతించారు. తెలంగాణ టైగర్‌గా కొండా వెంకట రంగారెడ్డికి పేరుంది. కొండా వెంకట రంగారెడ్డిని ముందుకు తీసుకుని రావడం ద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తన పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.

ఇదిలా వుంటే, తెలంగాణ ప్రాంతంలో తన పాదయాత్ర ద్వారానే కాకుండా తెలంగాణపై కాస్తా ముందుకు అడుగు వేసినట్లు ప్రకటనలు చేయడం ద్వారా చంద్రబాబు కాస్తా బలం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చంద్రబాబు ఎంతగా బలపడితే కెసిఆర్‌కు అంతగా లాభం ఉంటుందనే అంచనా సాగుతోంది. తెలుగుదేశం బలపడుతున్న కొద్దీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విస్తరణ ఆగిపోతుందనేది ఓ అంచనా. అందువల్ల తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమఉజ్జీలుగా నిలిస్తే, తెలంగాణవాదుల తమ పార్టీ వైపు ఉంటారని కెసిఆర్ నమ్ముతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+