బెణికిన కాలు: షర్మిల విశ్రాంతి, పాదయాత్రకు బ్రేక్

షర్మిల పాదయాత్ర శుక్రవారంనాడు 57వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంజాపూర్ చేరుకుని అక్కడ బస చేశారు. షర్మిల శుక్రవారం 16.30 కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. ఇప్పటి వరకు ఆమె పాదయాత్ర 824 కిలోమీటర్లు పూర్తయింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై నిప్పులు చెరుగుతూ ఆమె తన పాదయాత్రను సాగిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన అనురాధ అనే మహిళపై యాసిడ్ దాడి జరిగిందని, ఆమె వైద్యం చేయించుకోవడానికి ఏడాది పట్టిందని, అనురాధకు సహాయం చేసి అండగా నిలబడడానికి చంద్రబాబుకు మనసు రాలేదని షర్మిల శుక్రవారంనాటి పాదయాత్రలో ఆరోపించారు. అనురాధ ఉదంతాన్ని ఆమె వివరించారు.
కొంత కాలం క్రితం ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం విద్యార్థిని వరలక్ష్మి ఆత్మహత్య ఉదంతాన్ని షర్మిల గుర్తు చేశారు. ఆ సందర్బంగా ఫీజు రీయంబర్స్మెంట్ కోసం తన సోదరుడు వైయస్ జగన్ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. శుక్రవారంనాడు ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీ నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో సాగింది.












Click it and Unblock the Notifications