బెంగళూర్లో ఉరేసుకుని టెక్కీ భార్య ఆత్మహత్య
ఒరిస్సాకు చెందిన అజయ్, మమతల వివాహం రెండేళ్ల క్రితం జరిగిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, దీంతో మమత తన గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటున్నారు.
అజయ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి, ఆమెను కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయింది. మమత ఏ విధమై సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టలేదని సమాచారం.
మమత మృతి విషయంలో భర్త అబద్ధాలేమీ ఆడడం లేదని తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. తమ కూతురు ఒరిస్సాకు తిరిగి వెళ్లిపోవాలని పట్టుబడుతూ వస్తోందని మమత తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. స్వస్థలానికి వెళ్లలేకపోవడంతో ఆమె మానసిక క్షోభకు గురైనట్లు కనిపిస్తోందని అంటున్నారు. అల్లుడిపై ఫిర్యాదు చేయడానికి వారు ఇష్టపడలేదు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.