కెసిఆర్కు చెలగాటం: కోదండరామ్కు సంకటం?
ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి తనతో పాటు కోదండరామ్ వస్తారంటూ ఆయన ప్రకటించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వహించాలనే తెలంగాణ జెఎసి ప్రయత్నాలకు తద్వారా కెసిఆర్ మరోసారి బ్రేకులు వేశారని అంటున్నారు. విభేదాల కారణంగా ఎడమొగం పెడమొగంగా ఉంటూ వస్తున్న కోదండరామ్, కెసిఆర్ మధ్య ఇటీవలే సంధి కుదిరింది. ఈ సంధి కూడా కెసిఆర్ ఆశించిందే.
అఖిల పక్ష భేటీకి కోదండరామ్ను వెంట పెట్టుకుని పోవడం ద్వారా తెలంగాణ జెఎసి తనకు దూరంగా కాకుండా చూసుకోవాలని కెసిఆర్ ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. సిపిఐ, బిజెపిలను కూడా తనతో పాటు తీసుకుని పోవాలని కోదండరామ్ భావిస్తుండగా, అందుకు అవకాశం ఇవ్వకుండా కెసిఆర్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో అఖిల పక్ష భేటీకి వెళ్లడం వల్ల మళ్లీ ఓ పార్టీ ముద్ర తనపై పడే అవకాశాలున్నాయని కోదండరామ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ జెఎసి తెరాసకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ మిగతా పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది జెఎసి ఉద్దేశం. కెసిఆర్తో కలిసి ఢిల్లీకి వెళ్తే కోదండరామ్పై ఇతర పార్టీలు పాత విమర్సలకు మళ్లీ పదును పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. కెసిఆర్ తొత్తుగా కోదండరామ్ను ఇతర పార్టీ నాయకులు అభివర్ణించిన సందర్బాలున్నాయి.
ఇదే సమయంలో, తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై ఒత్తిడి పెట్టే పనిలో తెలంగాణ జెఎసి నిమగ్నమైంది. అఖిల పక్ష భేటీకి ముందు ఆ పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి తేవాలని భావిస్తోంది. అఖిలపక్షానికి వెళ్లినా ఆ పార్టీలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచీ వస్తోంది.