కూల్ బాయ్!: ట్విట్టర్లో రెచ్చిపోతున్న నారా లోకేష్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్లో రెచ్చిపోతున్నాడు! లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం కోసం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల లోకేష్ తన తండ్రి వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొనడం, ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు రావడం వంటి వాటిని పరిశీలిస్తే త్వరలో లోకేష్ రాజకీయ ఆరంగేట్రం ఖాయమని అంటున్నారు.
అయితే లోకేష్ 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. 2019 కోసం అతనిని ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే తెర వెనుక నుండి టిడిపి వ్యవహారాలు చూస్తున్నారని అంటున్నారు. త్వరలో నేరుగా చూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల లోకేష్ తండ్రి పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కాంగ్రెసు పార్టీ పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన స్పందించారు.
కాంగ్రెసుపై డైరెక్టుగా, జగన్ పైన పరోక్షంగా ఆయన చిన్నపాటి విమర్శలు చేస్తూ కూల్గా ఉంటున్నారు. అయితే బయట కూల్గా ఉంటున్న లోకేష్ ట్విట్టర్లో మాత్రం ఘాటుగానే కామెంట్స్ పోస్టు చేస్తున్నాడు. విషయాన్ని పెద్దగా చెప్పకుండా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాడు.
2009లో చంద్రబాబు నగదు బదలీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని రూపకర్త లోకేష్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కేంద్రం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతోంది. లోకేష్ దీనిని ఉద్దేశిస్తూ... కాంగ్రెసు పార్టీకి నగదు బదిలీని కాపీ చేసే హక్కు కూడా లేదని, ఇది సిగ్గు పడాల్సిన విషయమన్నారు.
కరీంనగర్ జిల్లాలో యాత్రలో చంద్రబాబు అవినీతి అంటే ఏమిటని ఓ చిన్నారిని అడిగితే 'జగన్' అని సింపుల్గా సమాధానం చెప్పారన్నాడు.
హెరిటేజ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలపై స్పందిస్తూ... విమర్శలు చేసే ముందు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
ఒక ఒలింపిక్ మెడల్ సాధించిన పుల్లెల గోపిచంద్ను వివాదాల్లోకి లాగడం బాధాకరమన్నారు.
కుమ్మక్కు రాజకీయాలపై స్పందిస్తూ... వైయస్సార్ కాంగ్రెసు, సాక్షి దిన పత్రిక టిడిపిని ప్రశ్నించడం జోక్గా అభివర్ణించారు. జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్కు ఓటు ఎందుకు వేశారని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెసు జగన్కు బెయిల్ వస్తుందని చెబుతున్నారే కానీ, నిర్దోషి అని మాత్రం చెప్పడం లేదని, ఇది ఫన్నీ అన్నారు.
బొత్స, కిరణ్లపై విమర్శలు గుప్పిస్తూ కిషోర్ చంద్రదేవ్ లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కేంద్రమంత్రితో ఏకీభవిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను కొనడమేమిటని ప్రశ్నించారు.
తన తండ్రి 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాక కెసిఆర్ నిద్ర లేచారని, విద్యుత్ సంక్షోభానికి టిడిపి ప్రభుత్వం కారణమని అంటున్నాడని ఇది వండర్ అన్నారు.
మజ్లిస్ కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో.. తాను అసదుద్దీన్తో ఏకీభవిస్తున్నానని, కాంగ్రెసు ప్రభుత్వం ముస్లింల విషయంలో ఫెయిల్ అయిందని, శాంతిని నెలకొల్పలేక పోతుందన్నారు.
వైయస్ జగన్ తదితరుల కోసం వాదిస్తున్న రాం జెత్మలానీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరమన్నారు.
తన తండ్రి చంద్రబాబు పాదయాత్ర పైన పలుమార్లు ట్వీట్స్ చేశాడు. పాదయాత్రకు ఐటి ఎంప్లాయీస్ మద్దతు పలుకుతున్నారని, 63 ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తున్నారని... ఇలా పలుమార్లు ట్వీట్ చేశారు.