నారా లోకేష్ దూకుడు: టిడిపి సీనియర్లకు తలనొప్పి?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దూకుడు పార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నారా లోకేష్ పార్టీ వ్యవహారాలు చూస్తూ పార్టీ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నారా లోకేష్ సలహా మేరకు తన ప్రసంగ పద్ధతిని మార్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యర్థులపై చేసే విమర్శలను ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్లాలో ఆయన చంద్రబాబుకు, ఇతర సీనియర్ పార్టీ నాయకులకు చెబుతున్నారని వినికిడి. అయితే, నారా లోకేష్ వ్యవహారం హైదరాబాదు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటున్న సీనియర్లకు తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ను తాము భావి నాయకుడిగా చూస్తున్నామని, అయితే, లోకేష్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడడం ఇబ్బందిగా ఉందని, పార్టీని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని వారు లోలోన కుమిలిపోతున్నట్లు వార్తలు వచ్చాయి.
నారా లోకేష్ సలహాలు కొన్నింటితో సీనియర్లతో ఏకీభావం కుదరడం లేదని అంటున్నారు. ఆ సలహాల మేరకు నాయకులు నడుచుకుంటే సీనియర్లుగా తామే వాటిని ఇచ్చినట్లు ప్రజలు అపోహపడే అవకాశం ఉందని వారు బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నారా లోకేష్ ఓ పవర్ సెంటర్గా ఏర్పడినట్లు చెబుతున్నారు. దాంతో కొంత మంది ఆయన చుట్టూ చేరారని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు.
నారా లోకేష్ కోటరీ వ్యవహారం చంద్రబాబు దాకా చేరిందా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. అయితే, లోకేష్ సలహాలను పాటిస్తున్న చంద్రబాబుకు తన కుమారుడి ప్రతిభ మీద నమ్మకం ఉండవచ్చు గానీ కొత్త కోటరీ వ్యవహారం తెలిసి ఉండదని అంటున్నారు. మొత్తం మీద, చంద్రబాబు బిజీగా ఉంటే, సీనియర్లు ఎందుకు వచ్చిన తంటా అంటూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.