కిరణ్, చిరులకు తెలంగాణ సెగ: హడావిడి స్పీచ్లు
కాకతీయ ఉత్సవాల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, నిధులు సరిగా విడుదల చేయలేదని మహిళలు ఆక్షేపణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ వేదికపై కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వేదికపై కూర్చుని ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్దు తగిలే ప్రయత్నం చేశారు. ఆయన ప్రసంగిస్తుండా ఎమ్మెల్యే తెలంగాణ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి శాసనసభ్యుడు వేదికి దిగి వెళ్లిపోయారు.
కాకతీయ ఉత్సవాల్లో చిరంజీవి ప్రసంగానికి కూడా తెలంగాణవాదులు అడ్డు తగిలారు. వేదికపై నుంచి ఆయన ప్రసంగించడం ప్రారంభించగానే ప్రజలు జైతెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు చిరంజీవిని డిమాండ్ చేశారు. కాకతీయ ఉత్సవాలకు నిధులు తక్కువగా ఇచ్చారని నిరసిస్తూ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఖిల్లా వరంగల్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నించిన తెలంగాణవాదులను పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్పై తెలంగాణవాదులు రాళ్లు విసరడంతో ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగిలాయి. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బస్సుపై తెలంగాణవాదులు రాళ్లు రువ్వడంతో ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మారారు. అయినా, తెలంగాణవాదులు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వరంగల్ కార్పోరేషన్ను గ్రేటర్ వరంగల్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖిల్లా వరంగల్ను మెగా సర్క్యూట్గా గుర్తింపు ఇవ్వనున్నట్లు చిరంజీవి చెప్పారు.