తెలంగాణ భేటీ: చిరు స్థానంలో జగన్, జెపికి లేదు
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సమావేశంలో చర్చ ఉండదని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ముగిసిన అధ్యాయమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. తెలంగాణపై తాజా పరిస్థితిపై అవగాహన కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పాయి. సమావేశంపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని సూచించాయి. తాము ఏ నిర్ణయం తీసుకునేది అఖిల పక్ష సమావేశం తర్వాత చెప్తామని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.
ఈ ఏడాది జనవరి 6వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్టీలకు అందించారు. తదుపరి సమావేశంలో ఆ నివేదికపై అభిప్రాయాలు చెప్పాలని పార్టీలకు సూచించారు. అయితే, ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్టీల అభిప్రాయాలు అడగబోమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నాలుగు శాతం పైగా ఓట్లు వచ్చాయని, ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 17 మంది శానససభ్యులు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అహ్వానం పంపామని ఆ వర్గాలు వివరించాయి.
రాజకీయ పార్టీలు తెలంగాణపై రెండు అభిప్రాయాలు చెబుతున్నాయని, అటువంటప్పుడు తాము ఏం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటూ వచ్చింది. ఈ నెల 28వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అభిప్రాయాల వెనక కారణాలు ఏమిటి అనే విషయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. తెలంగాణపై ఇక ఎక్కువ కాలం నాన్చకూడదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అఖిల పక్ష సమావేశం తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసే ప్రకటన అత్యంత కీలకమవుతుందని అంటున్నారు. తెలంగాణ ఇస్తుందా, ఇవ్వదా అనే విషయం దాదాపుగా తేలిపోతుందని అంటున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లీస్, సిపిఐ, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపిలను ఆహ్వానించింది. తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే తెలంగాణపై కచ్చితమైన వైఖరిని ప్రకటించడం లేదు.