సెక్సిస్ట్ రిమార్క్స్: నిరుపమ్కు ఇరానీ లీగల్ నోటీసు
గుజరాత్ శాసనసభ ఎన్నికలపై ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో నిరుపమ్ నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కొంత కాలం క్రితం వరకు టీవీ తెరలపై స్మృతి ఇరానీ నృత్యాలు చేసేవారని, ఇప్పుడు ఎన్నికల విశ్లేషకురాలిగా మారిపోయారని నిరుపమ్ వ్యాఖ్యానించారు.
నిరుపమ్ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా మండిపడి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నిరుపమ్పై చర్యలు తీసుకోవాలని బిజెపి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేసింది. పరువు నష్టం కలిగించారంటూ స్మృతి ఇరానీ సంజయ్ నిరుపమ్కు లీగల్ నోటీసు ఇచ్చారు. ఇరానీపై చేసిన వ్యాఖ్యల విషయంలో నిరుపమ్ హద్దులు దాటారని, కనీస మర్యాద కూడా పాటించలేదని బిజెపి అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ విమర్శించారు.
నిరుపమ్ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ కూడా వ్యతిరేకించింది. నిరుపమ్ వ్యాఖ్యలు విచారకరమైనవని కాంగ్రెసు అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, అటువంటి ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
నిరుపమ్ మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, వాటిని తమ పార్టీ ఖండిస్తోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సోనియా గాంధీ నిరుపమ్పై చర్యలు తీసుకుని, క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.