ఢిల్లీ గ్యాంగ్ రేప్: షిండే మావోయిస్టు వ్యాఖ్యలపై గరం
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్నకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన యువతను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మవోయిస్టులతో పోల్చడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. హోం మంత్రి తమను హింసాత్మక చర్యలకు దిగే మావోయిస్టులతో పోల్చడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఆందోళనకారులను కలవడానికి ఎందుకు ఇష్టపడడం లేదని సిఎన్ఎన్ - ఐబియన్ చానెల్ అడిగితే హోం మంత్రి వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడాలని చెప్పడం చాలా సులభమని, రేపు బిజెపి కార్యకర్తలు లేదా ఆయుధాలతో మావోయిస్టులు ప్రదర్శనలు నిర్వహిస్తే కూడా కలువాలా అని షిండే అన్నారు.
షిండే వ్యాఖ్యలపై ఆందోళనకారులు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా తప్పు పడుతున్నారు. హోం మంత్రిగా ఉన్నప్పుడు పి. చిదంబరం మావోయిస్టులతో మాట్లాడడానికి కూడా అభ్యంతరం లేదని చెప్పారని బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ గుర్తు చేశారు. నిజాయితీగా ఆందోళన చేస్తున్న వారిని కలుసుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు.
షిండేపై సిపిఎం నాయకులు బృందా కారత్ విరుచుకుపడ్డారు. ఈ హోం మంత్రిని అర్థం చేసుకోవడం ఎలాగో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. షిండే వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ కూడా మండిపడ్డారు. ఆందోళనకారులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలేమీ లేవని ఆయన అన్నారు.

మహిళలకు మరింత భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇవ్వడం వల్ల లాభం లేదని, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతుందో చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ప్రమాదం తప్పిందని చెప్పలేమని సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications