జగన్ పార్టీ చెప్పలేదు, క్లారిటీలేని టిడిపి: కెసిఆర్, బంద్
సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పలేదన్నారు. జగన్ పార్టీ ఏ అభిప్రాయం చెప్పకపోగా టిడిపి పాత పాటే పాడిందన్నారు. 2008లో లేఖ ఇచ్చామని చెప్పారు. కానీ దానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పలేదన్నారు. అఖిల పక్ష సమావేశంతో అయ్యేదేమీ లేదన్నారు. అప్పుడు చిదంబరం ఇలాగే అఖిలపక్షం ఏర్పాటు చేసిన నాలుగు వారాల్లో తేల్చుతామని చెప్పారని, ఇప్పుడు షిండే నెల అంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణపై కేంద్రం వెయ్యిసార్లు హామీ ఇచ్చిందన్నారు. ఇన్ని రోజులుగా చెప్పకుండా.. కాంగ్రెసు తన వైఖరి చెప్పకుండా నెలరోజుల్లో తేల్చుతామంటే తాము ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెసు తెలంగాణ నేతలు ఆ పార్టీ నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు నెల రోజుల సమయం అవసరమా అని ప్రశ్నించారు.
విభజన అనివార్యమని చెప్పామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సమావేశం సంతృప్తిగా సాగిందన్నారు. కేంద్రం తెలంగాణపై సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. మనం ఆశా జీవులమని.. నిరాశా జీవులం కాదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.
సమైక్యాంధ్రకే తాము మొగ్గు చూపామని లేదంటే రాయల తెలంగాణ ఇవ్వాలని తాము కోరినట్లు మజ్లిస్ పార్టీ చెప్పింది. కాంగ్రెసు పార్టీ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిప్రాయమే చెప్పలేదన్నారు. మజ్లిస్ కలిసుండాలి లేదా రాయల తెలంగాణ అని చెప్పిందన్నారు. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం చెప్పాలని కోరినట్లు చెప్పారు.
తాము 2008లో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని, అన్ని రకాలుగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని, ఎపిలోని అస్థిరతకు స్వస్థీ పలకాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని తాము చెప్పామని యనమల రామకృష్ణుడు అన్నారు. అఖిల పక్షంలో తాము ఏకాభిప్రాయం చెప్పామన్నారు. తెలంగాణ పోరాటం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సాధన కోసం లేఖ ఇచ్చామని, గతంలో ఇచ్చిన లేఖకు తాము కట్టుబడి ఉన్నట్లు సమావేశంలో చెప్పామని కడియం శ్రీహరి అన్నారు.