నెల రోజుల్లో: షిండే, అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం
న్యూఢిల్లీ: నెల రోజుల్లో తెలంగాణపై అభిప్రాయం వెలువడుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పాయని రాఘవులు చెప్పారు. షిండే కూడా మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన అఖిల పక్ష సమావేశం పదకొండున్నర గంటలకు ముగిసింది. గంటన్నర పాటు సాగింది.
ఈ భేటీలో వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. తెలంగాణకు తాము అనుకూలంగా ఉన్నామని, ఈ సమస్యను వెంటనే తేల్చాలని, పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతిస్తామని బిజెపి లేఖ అందజేసింది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లెటర్ హెడ్తో ఉన్న లేఖను టిడిపి అందజేసింది. యనమల రామకృష్ణుడు లేఖ అందించగా.. కడియం శ్హీహరి కాంగ్రెసు పార్టీని నిలదీశారు. కేంద్రం తేల్చాలని డిమాండ్ చేశాడు.
2008లో ఇచ్చిన లేఖకు తాము కట్టిబడి ఉన్నామని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని టిడిపి చెప్పింది. తాము తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది. తెలంగాణ సమస్యను వెంటనే తేల్చాలని, తాము తెలంగాణకు అనుకూలమని తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ చెప్పింది. కాంగ్రెసు పార్టికి చెందిన ఇరు ప్రాంతాల ప్రతినిధులు ఎవరి వాదన వారు వినిపించారు. ఫైనల్గా అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయం అన్నారు.
మజ్లిస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని లేదంటే రాయల తెలంగాణ అని చెప్పింది. గతంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన లేఖనే సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చింది. సిపిఎం సమైక్యవాదం వినిపించినప్పటికీ కేంద్రం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.