జనవరి 26 తర్వాత కూడా చంద్రబాబు పాదయాత్ర
వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్బంగా పాదయాత్రకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర వివిధ జిల్లాలో సాగుతోంది. తెలంగాణలో ఆయన ఎక్కువగా పాదయాత్ర చేశారు. దీంతో తమ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేయాలని కోస్తా నాయకుల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది. వారి కోరిక మేరకు పాదయాత్రను పొడగించుకునే విషయంపై ఆయన పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ముగుస్తుంది. జనవరి 26వ తేదీ తర్వాత ఆయన పాదయాత్ర ఎలా సాగాలనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి నల్లగొండ మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లా మీదుగా పాదయాత్ర సాగాలా, ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టి గుంటూరు జిల్లా మీదుగా సాగాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు సాగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇదిలావుంటే, కాంగ్రెసు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు శనివారం తన పాదయాత్రలో విమర్శించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి సంఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రపతి కుమారుడు చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన వరంగల్ జిల్లా వెల్లంపల్లిలో అన్నారు. అత్యాచార బాధితురాలి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి మృతికి సంతాపసూచకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధిరంచారు.
దేశ రాజధానిలోనే అటువంటి సంఘటన జరిగితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. ఘటనపై నిరసనకు దిగినవారిని పోలీసులు చితకబాదారని ఆయన విమర్శించారు. దోషులను శిక్షించడంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని అని అన్నారు. అత్యాచార సంఘటనలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయనే విషయాన్ని తెలియజేయాలని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అయేషా, నాగవైష్ణవి, వరంగల్లో యాసిడ్ దాడుల నిందితులపై సరైన చర్యలు లేవని ఆయన విమర్శించారు. ఢిల్లీ అత్యాచార బాధితారాలి మృతికి చంద్రబాబు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.